నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ,శిశు సంక్షేమ శాఖ పరిధిలోని శిశుగృహం (బాల్ రక్షక్) భవన్ లో పసికందు మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని సుభాష్ నగర్ లో గల శిశుగృహ (బాల్ రక్షక్) భవన్ లో సుమారు 24 మంది ఆరేళ్ల లోపు ఆనాథ చిన్నారులకు ఆశ్రయంగా ఉంది. అందులో 3 నెలల వయస్సు కలిగిన స్వతంత్ర అనే పసికందు కు తీవ్ర ఆనారోగ్యం ఉండగా మంగళవారం ఉదయం మేనేజర్, ఎఏన్ఎం జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యసేవలు అందిస్తుండగానే చిన్నారి స్వతంత్ర చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారని నిర్వహకులు తెలిపారు. చిన్నారి స్వతంత్ర సెప్టెంబర్ మాసంలో మతి స్థిమితం లేని బాలికకు జిల్లా ఆసుపత్రిలో జన్మించగా సంరక్షణ నిమిత్తం శిశుగృహం లో ఉంచారు. శిశుగృహంలో చిన్న పిల్లల వైద్యుడు లేరు. అక్కడ ఉన్న ఒక్కరే ఏఎన్ఎం ఉండగా పగటి వేళ మాత్రమే ఆమె వైద్య సేవలు అందుతున్నాయి. ఒకవేళ నిత్యం పిల్లల వైద్యుల పర్య వేక్షణ ఉంటే చిన్నారి స్వతంత్ర బ్రతికేదని చెప్పాలి.

