సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ
బతుకమ్మ, జుక్కల్ : ఆటో టాక్సీ, డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి డిసెంబర్ 7న ఒకరోజు బందును జయప్రదం చెయ్యాలని సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం వలన ఆటో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు .ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు అధికారంలోకి రాగానే సంవత్సరానికి 12వేలు ఇస్తామని ప్రకటించారని అన్నారు. అదేవిధంగా ఆటో, మోటారురంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆటోల బందును జయప్రదం చేయాలని దీనికి ప్రజలు కూడ సహకరించాలని సురేష్ గొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.