. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో ఘటన
ఎడపల్లి, బతుకమ్మ: చెట్టుకు వేలాడుతున్న గాలిపటాన్ని తీసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మతీన్(13) గాలిపటం కోసం చెట్టుపైకి ఎక్కి తీస్తుండగా ప్రమాదవశాత్తు హై ఓల్టేజీ విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మతీన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తన కుమారుడు తనను ఒంటరిని చేసి వెళ్లిపోయాడని బాలుడి తల్లి రోదించడం గ్రామస్తులను కంటతడిపెట్టింది. విద్యుత్ తీగలకు ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించడకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ మెన్ జగదీశ్ ను విధుల నుంచి తొలగించాలని రాస్తారోకో చేశారు.

