దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, బతుకమ్మ: బీసీ బిల్లుల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ ను బుధవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ఈదీక్షకు అనుమతి ఇవ్వాలని జాగృతి నాయకులు సెంట్రల్ జోన్ డీసీపీకి దరఖాస్తు లేఖను అందజేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టబోయే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని వారు విజ్క్షప్తి చేశారు.
