. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో వ్యవసాయ రంగానికి లో-వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా రోజుకు 18 గంటల పాటు సరఫరా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతాంగం సుమారు 2.5 లక్షల వ్యవసాయ పంపుసెట్ల కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని తెలిపారు. అయితే ప్రభుత్వం రైతులకు అవసరమైన విద్యుత్ను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న అరకొర 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా లో-వోల్టేజీతో వస్తుండటంతో వ్యవసాయ బోర్ల మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పంటలకు సకాలంలో నీరందక అన్నదాతలు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఎలాంటి లో-వోల్టేజీ, సరఫరా అంతరాయాలు లేకుండా రోజుకు 18 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్ కార్ లక్ష్మీనారాయణ, ప్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, తిరుపతిరెడ్డి, గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, తోట చిన్నయ్య, రాజేశ్వర్ రెడ్డి, అన్నం గోపి, పద్మా రెడ్డి, జగన్ రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, నాయిడి రాజన్న, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
