నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 14537 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. లోక్ అదాలత్ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల పరిధిలో లోక్ అదాలతో జరిగిందని తెలిపారు. న్యాయసేవ ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు వారికి అవగాహన కల్పించడం కోసం ప్రతి రోజు లోక్ అదాలత్ ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. జిల్లాలో 14537 కేసులను పరిష్కరించామని అందులో భాగంగా 68 రోడ్డు ప్రమాద కేసుల్లో రూ.5 కోట్ల 68 లక్షల 20 వేల అవార్డును జారీ చేసినట్లు తెలిపారు. 389 బ్యాంక్ కేసులను సెటిల్ చేసి రూ.2 కోట్ల 22 లక్షల 85 వేల అవార్డును జారీ చేసినట్లు తెలిపారు. 14 ల్యాండ్ కేసులను సెటిల్ చేసి రూ.61 లక్షల 37 వేల 785 అవార్డును జారీ చేసినట్లు తెలిపారు. 39 సైబర్ క్రైం కేసులను సెటిల్ చేసి రూ.3 లక్షల 4 వేల 894 అవార్డులను జారీ చేసినట్లు పేర్కొన్నారు. బీఎస్ ఎన్ఎల్ కు సంబంధించి 149 కేసులలో రూ.1 లక్షా 11 వేల 885 అవార్డులను జారీ చేసినట్లు తెలిపారు.