. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
. . . క్షేత్రస్థాయిలో అమలు తీరును పరిశీలించిన జిల్లా పాలనాధికారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎస్ఐఆర్ లో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలను కలెక్టర్ గురువారం పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని గాంధీనగర్ తండా, గూపన్ పల్లి గ్రామాలలో, నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ వివరాల, నమోదు తీరును నిశితంగా పరిశీలించారు.

ఇప్పటివరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయ్యింది, ఓటర్లు అందరికీ ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయిందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం అందించాలని, గడువు లోపు వారు తమ ఎన్యూమరేషన్ ఫారంలు తిరిగి అందించేలా చూడాలన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఎన్యూమరేషన్ ఫారంలను జాగ్రత్తగా పరిశీలించాలని, వివరాలు సరి చూసుకున్న మీదట వారి కుటుంబ సభ్యుడి సంతకంతో తీసుకోవచ్చని కలెక్టర్ బీఎల్ఓ లకు సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ను ఏకకాలంలో సమాంతరంగా నిర్వహించాలని అన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో పొందుపర్చిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని బీఎల్ఓ సూపర్వైజర్లను ఆదేశించారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఓటరు మ్యాపింగ్ విషయంలో సహకారం అందించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ దగ్గర ఓటరు జాబితా తప్పనిసరిగా ఉండాలని అన్నారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డబుల్ ఓట్లు కలిగిన వారిని గుర్తిస్తూ, ఓటరు జాబితాలో మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సకాలం లో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు బీఎల్ఓ లకు తగిన సహకారం అందించాలని అన్నారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, తహసీల్దార్ వినయ్ సాగర్ తదితరులు ఉన్నారు.
