బతుకమ్మ, బిచ్కుంద :
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని బిచ్కుంద పద్మశాలి సంఘం నాయకులు కొనియాడారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి పురస్కరించుకొని, బిచ్కుంద పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పద్మశాలి సంఘం బాన్సువాడ డివిజన్ నాయకులు డాక్టర్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసి, కొండా లక్ష్మణ్ బాపూజీ తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆయన బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలు అందించారన్నారు. నేటితరం కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.