సంగారెడ్డి, బతుకమ్మ: మత్తుకు బానిసన కొడుకు ఆస్తికోసం తండ్రి కళ్ల ముందే తల్లిని దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో చోటు చేసుకుంది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతులు ఇద్దరు కొడుకులతో కలిసి డివినో విల్లాస్ లో ఉంటున్నారు. చిన్న కుమారుడు కార్తీక్ రెడ్డి చిన్ననాటి నుంచే చెడు అలవాట్లకి బానిసయ్యాడు. మత్త పదార్థాలకు బానిసగా మారిన కార్తీక్ ను ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకువచ్చేందుకు మల్లారెడ్డి, రాధికారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఇటీవలే కోయంబత్తూర్ లోని డీ అడిక్షన్ సెంటర్ లో చేర్చారు. తమ కొడుకు మారాడని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. ఇంటికి వచ్చిన కొడుకు తనకు డబ్బులు ఇవ్వాలని, రూ.కోట్ల విలువైన వ్యవసాయభూమిని తన పేరిట రాయాలని వారితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున తల్లి రాధికారెడ్డిని తండ్రి కళ్ల ఎదుటే పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
