26.2 C
Hyderabad
Monday, August 3, 2026

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని

 

నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డి.జి.పి. శివధర్ రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ సృజన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాపై అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష నిర్వహించారు.  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కలెక్టరేట్ నుండి వీ.సీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలను 3 విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని, ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని తెలిపారు. 2011 ఎన్నికల జాబితా ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, 2024 ఎస్ ఈ ఈ ఈ పి సి సర్వే ప్రకారం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో గ్రామ గ్రామపంచాయతీలు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది, ఎన్నికల సామాగ్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

వీ.సీ అనంతరం కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నోడల్ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ విధులు బాధ్యతతో కూడుకుని ఉన్నందున ఎంతో అప్రమత్తంగా పని చేయాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని హితవు పలికారు. ఏవైనా సందేహాలు ఉంటే పై స్థాయి అధికారులను సంప్రదించి ముందుగానే నివృత్తి చేసుకోవాలని, ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, డీఈఓ అశోక్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Local body elections should be conducted efficiently.

More articles

Latest article