- ఇందూరు గడ్డపై అడుగుపెట్టగానే కోటి రతనాల వీణ అనే నానుడి గుర్తొస్తుంది
- చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ సూర్య ధనుంజయ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత 40 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో రచయితగా, రాజకీయవేత్తగా ప్రాముఖ్యత సాధించిన డాక్టర్ అమృత లత విజయ్ విద్యాసంస్థలను విజయవంతం గా కొనసాగించడం మామూలు విషయం కాదని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ సూర్య ధనుంజయ పేర్కొన్నారు. శనివారం విజయ్ హై స్కూల్ 44 వ టాలెంట్ షో సందర్భంగా ముఖ్య అతిథులుగా ఆమెతోపాటు ప్రముఖ రైటర్, గాయకుడు మిట్టపల్లి సురేందర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ గడ్డపై అడుగు పెట్టగానే నా మనసులో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నానుడి గుర్తొచ్చి నా హృదయం ఆనందంతో పులకించి పోయిందన్నారు. టాలెంట్ షో చూస్తే విజయ విద్యాసంస్థల్లో ఒక పండగ వాతావరణం లా కనిపిస్తుందన్నారు. గత నలభై ఏండ్లుగా నడుపబడుతున్న విద్యాసంస్థ కు నన్ను అతిధి గా ఆహ్వానించడం నేను చేసుకున్న అదృష్టమన్నారు. డాక్టర్ అమృతలత రచయితగా,రాజకీయ వేత్తగా వివిధ రంగాలలో ప్రావీణ్యురాలై విద్యార్థులను తీర్చి దిద్దుతున్న ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు సమయం విలువ తెలియాల్సిన అవసరం వారికి చెప్పాల్సిన బాధ్యత విద్యార్థి దశలోనే ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయులు వారి అనుభవాలను గుర్తు చేయాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు. తద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆడపిల్లలని ఆదరించి వారికి ప్రోత్సహిస్తే వారి జీవితాల్లో వెలుగును నింపినవారౌతామన్నారు. అమృతలతా అమ్మ ఒక సామాజిక వేత్తగానే కాకుండా అన్ని రకాలుగా గొప్ప మనస్తత్వం కలిగిన వారని పేర్కొన్నారు. పట్టుదల ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అమృతాలత జీవితంలో నిరూపితమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టాలెంట్ షో కార్యక్రమం ద్వారా విద్యార్థుల చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి.

