. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలో అరె కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పండుగలను నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. బోనాల వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అరె కటిక సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, కేశ వేణు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

