కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రంజిత్ అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన నర్సింలు ఇంటికి వెళ్లాడు. అక్కడే నర్సింలు అల్లుడు బాలయ్య కూడా ఉన్నాడు. దీంతో ముగ్గురు కలిసి మద్యం తాగారు. మాట పట్టింపు విషయంలో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మా ఇంటికే వచ్చి గొడవ చేస్తావా అంటూ నర్సింలు, బాలయ్య ఇద్దరు కలిసి.. రంజిత్పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రంజిత్ ను స్థానికులు వెంటనే బాన్సువాడకు, అక్కడి నుంచి నిజామాబాద్ జీజీహెచ్ కు తరలించారు. దాడికి గురైన బాధిత యువకుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడం, దాడి చేసిన వారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు కావడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఇటీవల సోమర్ పేట లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిన సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరిగిన ఈఘటన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
