. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
జూనియర్ కళాశాలలో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా అధ్యాపకులు పని చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. సోమవారం కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటగిరి మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వర్ని మోడల్ జూనియర్ కళాశాల, రుద్రూర్ కె. జి. బి. వి. జూనియర్ కళాశాలలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, బోధన, బోధనేతర సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం డిఐఈవో రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ తీర్చి దిద్దే బాధ్యత అధ్యాపకులదేనన్నారు. ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలలో తరగతుల నిర్వహణ అధ్యాపకుల, సిబ్బంది పనితీరును పర్యవేక్షణ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలని విద్యార్థులకు ఉద్భోదించారు. కళాశాలలో ప్రిన్సిపాల్ లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారానే నిర్వహణ చేయాలని అన్నారు. విద్యార్థులకు నవంబర్ నెలలోనే సిలబస్ పూర్తి చేసి ప్రయోగ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు గమనిస్తూ కళాశాలకు హాజరుకాని విద్యార్థులను రప్పించేందుకు ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. రానున్న వార్షిక పరీక్షలకు మంచి ఫలితాలను సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి అందరూ ఉత్తీర్ణులయ్యే విధంగా బోధన కొనసాగించాలని అన్నారు.

