నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వివరాలు,బందోబస్తు పాయింట్లు, సిబ్బంది అప్రమత్తత తదితర అంశాలను పరిశీలించారు. అలాగే ప్రతి మండపం వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సిబ్బంది విధుల్లో భాగంగా నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని,ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్ అధికారులు,సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన కోరారు. సీపీ వెంట టౌన్ ఏసిపి ప్రకాష్, 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి, ఎన్ఐబి సీఐ అశోక్, సిబ్బంది ఉన్నారు.

