మోర్తాడ్, బతుకమ్మ :
ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సోమ రాజేశ్వర్ శనివారం మోర్తాడ్ మండలంలోని తన స్వగ్రామం తిమ్మాపూర్లోని 87వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), సూపర్వైజర్లకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు లేదా వివరాల్లో మార్పులు, చేర్పులు చేయించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొని ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
