. . . తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న
బిచ్కుంద, బతుకమ్మ :
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీలను ఈనెల 28 వ తేదీ ఆదివారం రోజున గ్రామ దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చుస్తే దేశంలో దళితులకు ఇంకా స్వతంత్రం వచ్చిందా అన్న అనుమానం వస్తోందని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత అమానుషమని, రాజ్యాంగ విరుద్ధమని ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి దశాబ్దాలు గడుస్తునప్పటికీ కుల వివక్ష పేరుతో దళితులను దేవాలయాల్లోకి రానివ్వకపోవడం దారుణమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కాలరాస్తూ కొందరు అగ్రవర్ణాలవారు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. కొత్తపల్లి గ్రామంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మాదిగలను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి బాధిత దళిత కుటుంబాలకు రక్షణ కల్పించడంతో పాటు, గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. కుల వివక్ష, అంటరానితనం రూపుమాపేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాలని, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా అయన తెలియజేశారు.
