నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. మొదటి రోజు ఈ శిక్షణ తరగతులను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని అంశాన్ని తీసుకొని పార్టీ భవిష్యత్ గురించి సలహాలు సూచనలు చేశారు. రెండవ రోజు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కుమార్ పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ప్రతీ బూత్ కమిటీని క్రియాశీలం చేసి, ఓటర్లతో మమేకం కావాలని సూచించారు. ఈ శిక్షణ తరగతులు కేవలం పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే పరిమితం కాదని, కార్యకర్తలలో క్రమశిక్షణను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవని ఉద్ఘాటించారు. “వ్యక్తుల కన్నా పార్టీ మిన్న, పార్టీ కన్నా దేశం మిన్న” అనే సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ.. కార్యకర్తలు ఎల్లప్పుడూ దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, ఆ దిశగా క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త అలుపెరగకుండా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతి రెడ్డి, మోడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, భారత్ రెడ్డి, జిల్లా పదాదికారులు, మండల అధ్యక్షులకు తదితరులు పాల్గొన్నారు.

