నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న పోలీసులను దుర్భాషలాడడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ట్యాబ్ ను ధ్వంసం చేసిన ఇద్దరికి న్యాయస్థానం రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించిందని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింహారెడ్డి తెలిపారు. 2019 మే మాసంలో మోపాల్ మండలం ధర్మారం తాండకు చెందిన కేతావత్ సంతోష్, కేతావత్ శ్రీనులు ముదక్ పల్లి చౌరస్తా వద్ద డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు తారసపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ఇరువురిని పోలీసులు పరీక్షించగా వారు మద్యం సేవించినట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్కడ ఇరువురు ఎస్సై, సిబ్బందితో గొడవపడ్డారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో డ్రంకన్ డ్రైవ్ నమోదు చేసే పోలీస్ ట్యాబ్ ను ధ్వంసం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గురువారం నిజామాబాద్ అదనపు డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి హరీషా ఇధ్దరికి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా విధించారు. జరిమానా విధించని యేడల అదనంగా నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు.
