. . . ఇఫ్తార్ విందులో సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని సీపీ సాయిచైతన్య ఆకాంక్షించారు. శుక్రవారం నగరంలోని 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీద్లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముక్తి సయీద్ అక్బర్ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ శ్రీనివాస్ రాజ్, ఎస్.ఐ సయ్యద్ ముజాహిద్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ మన్నన్, కార్పొరేటర్ అబ్దుల్ అందాన్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖుద్దుస్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

