ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించకూడదు

0 9,035

 

. . . సీ.ఎస్ లు, డిపార్ట్ మెంటల్ అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఆదేశాలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పదవ తరగతి వార్షిక పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులతో కలెక్టర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

 

Cell phones should not be allowed inside SSC examination centers.

 

ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను లోనికి అనుమతించకూడదని, ఒకవేళ ఎవరైనా తీసుకువస్తే మెయిన్ గేటు వద్దనే స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసుకునేలా అన్ని సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, విమర్శలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించడంలో సీ.ఎస్ లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్యనే ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. బయటి వ్యక్తులు ఎవరూ పరీక్షా కేంద్రాల లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, పరీక్షా సమయం ముగిసేంత వరకు లోపలి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులు కనీసం అర గంట ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి గదిలోనూ తప్పనిసరిగా తగినంత వెలుతురు, తాగునీటి వసతి, సానిటేషన్ ను చక్కబెట్టుకోవాలని, ముందుగానే ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఓ ఎం ఆర్ షీట్స్, ఫర్నీచర్ సరిపడా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. అవకతవకలకు తావు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని, విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా కృషి చేయాలని అన్నారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 

Cell phones should not be allowed inside SSC examination centers.

 

Leave A Reply

Your email address will not be published.