బతుకమ్మ, బోధన్: తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ ప్రధాన సలహాదారుగా ఇటీవల నియమితులైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి శుక్రవారం బోధన్ పట్టణానికి మొదటిసారిగా చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆచన్పల్లి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూల గజమాలు అర్పించి సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించారు. బోధన్ టీటీడీ కల్యాణ మండపంలో పార్టీ తరఫున ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వినియోగానికి మూడు నూతన వాహనాలను సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. బోధన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. పట్టణ పురోగతికి ప్రభుత్వం మరింత సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నేతలు సుదర్శన్ రెడ్డి నియామకంపై ఆనందం వ్యక్తం చేస్తూ, బోధన్ అభివృద్ధి దిశగా మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


