- 469 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
- 10,40,089 నగదు స్వాధీనం
- కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించామని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దాడుల్లో 82 కేసులు నమోదు చేసి 469మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.10,40,089 నగదు, 321 మొబైల్ ఫోన్లు, 45 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పేకాట వంటి చట్టవిరుద్ద కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గ్రామాలు, పట్టణాలు, ఫాం హౌజ్ లు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712686133, డయల్ 100, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
