- కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
- కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరపాలని ఆదేశం
- పెగడాపల్లి, సాలంపాడ్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
నిజామాబాద్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బోధన్ మండలం పెగడాపల్లి, సాలురా మండలం సాలంపాడ్ క్యాంప్ లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కౌలు రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లలో ఒకింత జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో కౌలు రైతుల పేర్లు లేని పక్షంలో వారు వరి పంట సాగు చేశారా లేదా అన్నది వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ధృవీకరణ పత్రం అందించాలని, రైతుల వివరాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేయాలని ఆదేశించారు. వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని, సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ ను ఆదేశించారు. కాగా, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలనైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ రైతులకు తెలిపారు. గత సీజన్ లో 600 కేంద్రాలు ఉండగా, ఈసారి 670 కేంద్రాలు నెలకొల్పుతున్నామని, అవసరమైన చోట అదనంగా కూడా కేంద్రాలను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యాతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, తహసీల్దార్ విఠల్, ఏ.ఓ సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు.

