- సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత పదవులను ఛేజిక్కించుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు కోరారు. నిజామాబాద్ నగరంలోని బిసి స్టడీ సర్కిల్ ను సందర్శించి అక్కడ అభ్యశిస్తున్న అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వాలు ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలలో ఫలితాలు రావాలంటే అభ్యసనంలో శ్రమించాల్సిందేనని అన్నారు. శ్రమ లేకుండా ఫలితం ఉండదని, శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని ఆయన తెలిపారు. చదువుకున్న చదువుల సారాంశమే కాకుండా జనరల్ నాలెడ్జి కూడా ముఖ్యమేనని వివరించారు. ప్రకృతిని పరిశీలించిన, చూసిన ఎన్నో ప్రశ్నలు ఉదయించిన, వాటికి జవాబులు కూడా లభిస్తాయని అవి పోటీ పరీక్షలకు కరదీపికలు అవుతాయని పేర్కొన్నారు. భారత రాజ్యంగం నిరంతరం చదవాలని, అందులోనుండి ప్రవహించిన జ్ఞానం, విజ్ఞానంగా మారి ఎంతో మేధోశక్తి లభిస్తుందని అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా దేశ పార్లమెంట్, రాష్టాల శాసన సభలు తయారు చేసిన చట్టాలు తెలుసుకోవాలని ఉద్భోదించారు. నిరంతర అబ్యాసం మెదడుకు మేతల ఉపయోగపడి నూతన విషయాల పుట్టుకకు మార్గం చూపుతుందని అన్నారు. బిసి స్టడీ సర్కిల్ లో అధ్యయనం భవిష్యత్ జీవనానికి దిక్సూచిగా నిలవడం గొప్ప విషయమని జడ్జి ఉదయ్ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు మాట్లాడుతు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, మెగాజైన్స్, పత్రికలు చదివి ఎవరికి వారు బతుకు చరిత్రను లిఖించుకోవాలని కోరారు.
