- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గణేష్ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమీషనర్ పీ. సాయి చైతన్య తో కలిసి గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన రోడ్లు, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన గట్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు భద్రతగా, శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. నిమజ్జన దినాన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే కు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, నగర మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్, జిల్లా అధికారులు, బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

