పెద్దపల్లి, బతుకమ్మ : పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం లో కారుణ్య నియామకం విషయంలో కనికరించడం లేదనే ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన కలకల రేపింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందించేందుకు వచ్చి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్ గా పనిచేస్తున్న తన తండ్రి బండి లింగయ్య గత జనవరి 26న విధుల్లో ఉండగా పాముకాటుతో చనిపోయాడు. విధుల్లో ఉన్నప్పుడు చనిపోయిన తన తండ్రి ఉద్యోగం తనకి ఇస్తామని జెడ్పీ సీఈవో నరేందర్, ఇతర అధికారులు ప్రకటించారు. కాగా, తనకు ఉద్యోగం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని విసిగిపోయి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు అధికారులదే బాధ్యతని ఆరోపించారు. అధికారులు బండి సతీష్ ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నాడు.
