ఇందిరమ్మ కాలువకు నీటి విడుదల
మెండోరా, బతుకమ్మ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుతోంది. మహారాష్ట్రలోని గోదావరి ఎగువ భాగంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఎస్ఆర్ఎస్పీకి వరద పోటెత్తింది. శనివారం లక్ష క్యూసెక్కులు వచ్చిన వరద ఆదివారం 1,51,806 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటిమట్టానికి గాను 62.104 టీఎంసీల నీటిమట్టం ఉండటంతో నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదివరకే కాకతీయ కాల్వకు నాలుగు క్యూసెక్కుల నీటిని, అలీ సాగర్ లిఫ్ట్ కు 180 క్యూసెక్కుల, మిషన్ భగీరథ కు231 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదలను చేసినట్టు ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు గుప్తా తెలిపారు.
