- జూన్ 5న విచారణకు హాజరుకానున్న కేసీఆర్
దరాబాద్, బతుకమ్మ : తెలంగాణా రాజకీయాల్లో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కాళేశ్వరం నోటిసులపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పీ.సీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలిసింది. జూన్ 5న విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై ఎల్ అండ్ టీ లేఖ రాసిన తర్వాత కేసీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. మొదట్లో కెసిఆర్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ కోర్టు కు వెళ్లారు. అదే సమయంలో మీడియా ముందు నాటి కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పలు విషయాలు వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నర్సింహారెడ్డి ని చైర్మన్ పదవి నుండి తప్పించాలని ఆదేశించింది. తర్వాత కొత్త చైర్మన్ నియామకం ఆలస్యం కావడంతో విచారణ కూడా ఆలస్యమైంది. ఈ మధ్యలో కేసీఆర్ విచారణకు భయపడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడమే లక్ష్యంగా విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ఢీఎస్ఏ రిపోర్ట్ తప్పుల తడక అన్నట్లుగా ఎల్ అండ్ టీ నేరుగా లేఖ రాయడం.. కేసీఆర్ కు కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. నిర్మాణంలో నాణ్యత లోపాలు లేవని కేసీఆర్ హరీష్ రావు మొదటినుండి వాదిస్తున్న నేపథ్యంలో ఎల్ అండ్ టీ రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. విచారణకు సంబంధించి… అడగబోయే ప్రశ్నలకు సంబంధించిన అంశాలను కూడా ఇప్పటికే కొన్ని కేసీఆర్ కు అందించినట్లుగా తెలుస్తోంది.
