నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వరల్డ్ లూపస్ డే సందర్భంగా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలో శనివారం ఉదయం 2కే రన్ నిర్వహించారు.
వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ నుంచి నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటీస్ సెంటర్ వరకు నిర్వహించిన 2కే రన్ లో ఐఎంఏ వైద్యులు, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్) డీఎం , (రుమటాలజీ) గోల్డ్ మెడలిస్ట్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఇమ్యునాలజిస్ట్, అలెర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ.. శరీరంలోని కళ్లు, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్త నాశాలు ఏ భాగాన్నైనా లూపస్ వ్యాధి ప్రభావితం చేస్తుందని, ఈ వ్యాది శరీరంలో చర్మం దగ్గర నుంచి గుండె వరకు అన్ని అవయవాలపైన దాడి చేస్తుందని అన్నారు.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐఎంఏ అధ్యక్ష్డుడు అజ్జ శ్రీనివాస్, కోశాధికారి రాజేందర్ సూరినీడు మాట్లాడుతూ.. వ్యాధి బారినపడిన వారిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందని, ఎండలోకి వెళ్లినప్పును వేడికి చెంపలపైన దద్దుర్లు, ఎలాంటి కారణం లేకుడా జ్వరం వచ్చిపోతూ, కీళ్లు, తల నొప్పి వస్తుందన్నారు. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే రుమటాలజిస్ట్ ను సంప్రదించి వ్యాధి తీవ్రతను బట్టి వారు సూచించిన మందులు వాడాలన్నారు.
అనంతరం ఎంబీసీఎస్, ఎండీ (జనరల్ మెడిసిన్), డీఎం (కార్డియాలజీ), పీడీఎఫ్ (ఫీటల్ కార్డియాలజీ) డాక్టర్ జి రవికిరణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా వంటి ప్రక్రియలతో ఒత్తిడి తగ్గించుకోవడం వంటి మంచి జీవనశైలిని అలవరచుకోవాలి అన్నారు. డాక్టర్ జీవన్ రావు, శ్రీశైలం, పీబీ కృష్ణమూర్తి దామోదర్ రావు, ద్వారకానాథ్, గాంధీ, రాజేందర్ సూరినీడు, తదితరులు పాల్గొన్నారు.
