హైదరాబాద్, బతుకమ్మ: మేడి గడ్డ బరాజ్ పై డ్రోన్ ఎగురవేసిన ఘటనతోపాటు మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ నిధులను తరలించిందనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లను హై కోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో కేటీఆర్ కు భారీ ఊరట లభించినట్టైంది.
మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ రూ.25వేల కోట్లను తరలించిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేసి తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
అలాగే మేడిగడ్డ బరాజ్ పై డ్రోన్ ఎగురవేసిన ఘటనలో ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ తోపాటు మరికొందరిపై మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో ఇరువైపులా వారి వాదనలు విన్న హై కోర్టు ఎఫ్ ఐ ఆర్ లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
