హైదరాబాద్, బతుకమ్మ: పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ లు దాఖలు చేసిన విషయం విదితమే. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సోమవారం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా, శాసన సభా కార్యదర్శి పార్టీ మారిన వారందరికీ తాజాగా నోటీసులు ఇచ్చారు. కాగా వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. పార్టీ మారిన వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు రాష్ర్టంలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, క్రిష్ణ మోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఉన్నారు.
