- 30 కోట్ల రూపాయలతో రోడ్లకు శంకు స్థాపన చేసిన మంత్రి
- నిజామాబాద్ రూరల్ ప్రాంత అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో 250 కోట్ల కేటాయిస్తం
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు, సినీ ఆటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పనులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు, సినీ ఆటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి 8 కోట్ల రూపాయల డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాత గురడి రెడ్డి సంఘంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ధర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి ధర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు శాలువ కప్పి,గజమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి డాక్టర్ గా సేవలందించిన ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే కోరిక మేరకు 250 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సోనియా గాంధీ పుట్టిన రోజు వరకు ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభిస్తామని, సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు రూపాయలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇందల్వాయి ధర్పల్లి మండలాలకు 30 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. కెసిఆర్ దొంగ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియా గాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందని, కాలేశ్వరం కమిషన్ల కోసమే కెసిఆర్ కట్టాడని ఆయన విమర్శించారు. దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ దీక్ష దివస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని దోచుకున్న బావ,బామ్మర్దులు మరోసారి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వస్తున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మవద్దని ఆయన అన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ మంత్రి వర్యులు తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి 250 కోట్లు రూపాయల నిధులు ఇవ్వాలని, తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రిని కోరారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. ఆర్.భూపతిరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహార్ బిన్ హంధాన్, ఐసిడిఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మండలాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, సొసైటీ చైర్మన్లు చెలిమెల చిన్నారెడ్డి, వెంకన్న గారి జనార్దన్ రెడ్డి, నాయకులు చెలిమెల నర్సయ్య,శ్రీనివాస్ ,మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

