నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి(దేవీరోడ్) నుంచి గాంధీ గంజ్ కమాన్ వరకు ప్రయాణమంటేనే హడలెత్తిన ప్రజలు ఇప్పుడు రయ్ మని దూసుకెళ్తున్నారు. నగరవాసులు, వాహనదారులు మెచ్చేలా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించడంతో దశాబ్ద కాలంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. పాత్ గంజ్ ప్రాంతం ఇప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రశాంతంగా కనిపిస్తోంది. దీంతో ప్రజలు, వ్యాపారులు ముప్ప నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

