జుక్కల్, బతుకమ్మ: పెద్ద కొడప్ గాల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాల్ సోయాకు రూ.4,892 మద్దతు ధర ప్రకటించిందని, కొనుగోలు కేంద్రంలో సోయాను విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులను సూచించారు. ఇంతకుముందు కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్లు మాత్రమే సేకరించేవారని, తాను సీఎంతోపాటు వ్యవసాయశాఖ మంత్రిని కలిసి దీనిపై మాట్లాడగా, ఎకరానికి పది క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు,స్థానిక మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

