Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:36 pm Posted by : ramakrishna

యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

 

లింగంపేట్, బతుకమ్మ :

 

మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలను యువకులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రామస్వామి సూచించారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “విద్య వారోత్సవాలలో” భాగంగా శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి రామస్వామి తాడ్వాయి మండల కేంద్రంలోని లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానమన్నారు. పుస్తక పఠనం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సహనం వస్తుందని తెలియజేశారు. లైబ్రరీలు విజ్ఞానానికి గుండెకాయ వంటిదని వెల్లడించారు. యువత సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీలలో గడపాలని సూచించారు. గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను పఠణం చేయడం వల్ల పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఉపాధ్యాయులు శ్రీకాంత్, లైబ్రేరియన్ రాజలింగం, మాజీ సర్పంచ్ సంజీవ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.