Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 6:32 pm Posted by : ramakrishna

సమసమాజ స్థాపనకి యువత కదిలి రావాలి

 

. . . భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్థంతి సభల గోడ ప్రతికల ఆవిష్కరణ

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదం భగత్ సింగ్ ద్వారా ప్రతి ఒక్కరం అందిపుచ్చుకొని సమసమాజ స్థాపనకు యువత ముందుకు వెళ్లాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మండల కార్యదర్శి మున్నా కుమార్ కోరారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతి సభలు ఈ నెల 23 నుండి 30 వరకు నిర్వహించాలని ఇందల్ వాయి గ్రామంలో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో మంగళవారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశభక్తిని నింపుకొని బ్రిటిష్ వారినీ గడగడలాడించిన విప్లవ యువకిశోరం భగత్ సింగ్ అని అన్నారు. యుక్త వయస్సులోనే దేశం కోసం ఉరితాడునే ముద్దాడిన షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవులు నిజమైన దేశభక్తులన్నారు. కానీ నేడు ప్రజలను, విద్యార్థులను, యువతి యువకులను కులం, మతం, దేవుడు పేరుతో విభజించి పాలించే ఈ రాజకీయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెల్ల దొరలను ఎదురించిన యువ కిశోరాల ఆశయ సాధనంతో, నల్ల దొరల అవినీతి పాలనను కూడా ఎండగట్టే విధంగా యువకులు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్, లక్ష్మణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.