నిజామాబాద్, బతుకమ్మ :
పట్టణంలోని బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్న సమయంలో పవర్ గార్డెన్ ఎదురుగా చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నవీన్ (25) అనే యువకుడు స్కూటీపై రిలయన్స్ బైపాస్ వైపు నుంచి అర్సపల్లి వైపు వెళ్తుండగా, అదే మార్గంలో అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నిజామాబాద్ నగర మూడో టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు త్రీ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.