నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక పోలీస్ స్టేషన్ లో యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలో నాగారం ప్రాంతానికి చెందిన మహ్మద్ జీషాన్ ను స్థానిక ఆరవ టౌన్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న కేసులో సారంగపూర్ లో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రిమాండ్ కు తరలించేందుకు సిద్ధం అవుతుంటే పోలీస్ స్టేషన్ లోని బాత్ రూంలో ఉన్న ఫినాయిల్ తాగడంతో అతడిని ఎల్లమ్మ గుట్టలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయించి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. జీషాన్ ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణ , రిమాండ్ వ్యవహారంలో వేధింపులు కారణమని బాధితుడి తండ్రి అయూబ్ ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మార్చి 11న చనిపోయిన విషయం మరువకముందే మరో యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.