బతుకమ్మ, బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును రద్దు చేసే వరకు దేశ వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా కన్వీనర్ జలీసా సుల్తానా పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త ఎండోమెంట్ చట్టంపై బాన్సువాడ డివిజన్ కేంద్రంని మీనా గార్డెన్ లో ముస్లిం మహిళల మహాసభ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుల్తానా మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రచారంలో భాగంగా జిల్లాలు, నగరాలలలో మహిళలు, పురుషులకు సంబంధించిన నిరసన కార్యక్రమాల పరంపర కొనసాగుతోందని అన్నారు. వక్ఫ్ సవరణలు మత, సాంస్కృతిక, మత సామరస్యం, రాజ్యాంగ నిర్మాణంపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మతపరమైన ఎజెండాకు మద్దతు ఇస్తున్నాయని, తద్వారా లౌకికవాదానికి సంబంధించిన వారి తప్పుడు వాదనలను బహిర్గతం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సవరణలు ఇస్లామిక్ బోధనలు, మతపరమైన స్వేచ్చలు, మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక విలువలను ఉల్లంఘించాయన్నారు. వివిధ మత, కమ్యూనిటీ ఆధారిత, సామాజిక సమూహాల సహకారంతో దేశవ్యాప్త ఉద్యమానికి ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. ఈ సవరణలు పూర్తిగా రద్దు చేయబడే వరకు కొనసాగుతుందని, ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడదని, మార్పులను వ్యతిరేకిస్తూ బలమైన, రాజ్యాంగబద్ధమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తామని బోర్డు హామీ ఇచ్చిందన్నారు. ఈ నిరసనల ముగింపులో, స్థానిక అధికారుల ద్వారా రాష్ట్రపతి, హాంమంత్రికి అధికారిక వినతిపత్రాలు అందజేయబడతాయన్నారు. ఉద్యమం ప్రారంభ దశ వక్ఫ్ ఆస్తులు, రాజ్యాంగ హక్కులపై సవరణల ప్రభావాల గురించి అవగాహన పెంచడంపై దృష్టి పెడుతుందన్నారు. ( సేవ్ వక్ఫ్, సేవ్ ది కాన్స్టిట్యూషన్) పేరిట ఈ ఆందోళనలు జరుగుతాయని అన్నారు.ప్రారంభ నిరసనలు ఈద్వుల్ అదా వరకు కొనసాగుతాయి, తదుపరి. దశకు సంబంధించిన ప్రణాళికలు తర్వాత నిర్ణయించబడతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు హఫీజ్ ఫహిముద్దీన్ మునిరి, సభ్యులు డాక్టర్ ఖుద్దూస్, నసీరా ఖానుమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
