Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 6:52 pm Posted by : ramakrishna

సహజీవనం చేయడం లేదని మహిళ హత్య

  • వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తనతో ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న మహిళ ఆ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించడంతో  ప్రియుడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 6న నిజామాబాద్ నగరంలోని  ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని రైల్వే కంపౌండ్ లో వెలుగు చూసిన గుర్తు తెలియని మహిళ డేడ్ బాడీ కేసును మర్డర్ కేసుగా విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… కామారెడ్డి జిల్లా లింగాయి పల్లికి చెందిన గులాల సవితకు ఇదివరకు వివాహం జరిగి విడాకులు అయ్యాయి. ఆమెకు ఒక కూతురు ఉంది. సవితకు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన పల్లె రాకేష్ అలియాస్ నవీన్ తో పరిచయం  వివాహేతర సంబంధానికి దారి తీసింది. అవారాగా తిరిగే నవీన్ సవితతో సహజీవనం చేస్తున్నాడు.  పల్లే రాకేష్ గతంలో చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చాడని తెలిసింది. ఇటీవల కాలంలో సవిత పల్లె రాకేష్ తో సహజీవనం చేయడానికి నిరాకరించింది. 25 రోజుల క్రితం నిజామాబాద్ కు వచ్చిన ఇద్ధరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, జిజి హెచ్ ప్రాంతాలలో తిరుగుతున్నారు. తనతో సహజీవనం కొనసాగించడానికి సవిత ఇష్టపడకపోవడంతో ఆమెను రైల్వే కంపౌండ్ ప్రాంతానికి నమ్మించి తీసుకువెళ్లి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. ఇటీవల విచారణలో భాగంగా పల్లే రాకేష్ ను పట్టుకుని విచారించగా హత్య చేసిన విషయంను అంగీకరించడంతో అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ఒ రఘుపతి తెలిపారు.