- నిజామాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాలు
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యమ నేత అశోక్ కుమార్ ను గెలిపించాలని నిజామాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నటీపీటీఎఫ్ అభ్యర్థి వై.అశోక్ కుమార్ కు మద్దతుగా నిజామాబాద్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ మాట్లాడుతూ వై.అశోక్ కుమార్ 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ టీపీటీఎప్ లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమం కొరకు నిరంతరం ఉద్యమాలు చేశారన్నారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకులుగా పేరు ప్రఖ్యాతలు గడించారని అన్నారు. నిజాయితీకి, నిబద్ధతకు ,నిస్వార్ధతకు మారు పేరుగా నిలిచిన అశోక్ కుమార్ ఉపాధ్యాయ ఎమ్మల్సీ గా సరైన అభ్యర్థి అన్నారు. ఈ నెల 27 న జరిగే ఎన్నికల్లో అశోక్ కుమార్ ని మొదటి ప్రాధాన్యతా ఓట్లతో గెలిపించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమమే తన లక్ష్యమని నన్ను ఎమ్మెల్సీ గా గెలిపిస్తే నిరంతరం ఉపాధ్యాయుల వైపు నిలబడి విద్యారంగ సంక్షేమానికి పాటు పడతారన్నారు. యుటిఎఫ్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమాలకు బాసటగా నిలిచి రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయుటకు, ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ యూనియన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల యజమానులు ధన బలంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని, ధన రాజకీయాలను ఓడించాలన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ ఉద్యమ నాయకులను ఉపాధ్యాయ MLC గా ఎన్నుకుని ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ మాట్లాడుతూ అశోక్ కుమార్ ని ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో టి పి టి ఎఫ్ నాయకులు సల్ల సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ యూనియన్ నాయకులు సుధామ్, పోషన్న, లెక్చరర్ యూనియన్ నాయకులు ప్రవీణ్ కుమార్ నరేందర్ లక్ష్మీనారాయణ, గంగా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.