Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 4:31 pm Posted by : ramakrishna

పంట కొంటారా..?  కొనరా..?

  • నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు
  • రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే
  • ఎండలకు ఎండు తున్నయి, వానలకు తడుస్తున్నయి
  •  బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ:  రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను  కొంటారో..? కొనరో..? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నా ఈ ఇందిరమ్మ రాజ్యానికి  ఇసుమంత కనికరం కూడా లేదని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రోడ్లపై, కల్లాల్లో మండుతున్న ఎండలకు ఎండుతూ తూకం తగ్గుతోందని, అకాల వానలకు తడిచి ముద్దవుతోందని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి అన్నదాతల ఆరుగాలం శ్రమ ఆవిరవుతోందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేకేశ్వర్, ఆలూర్, నందిపేట్ ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంట పండించారని ఆయన తెలిపారు. అయితే ధాన్యం  కొనేదిక్కులేక రైతుల దైన్యం వర్ణనాతీతమని ఆయన చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.  అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికి వారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కల్లాలపై ధాన్యం రాశులు మాత్రం కదలడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దయనీయ పరిస్థితి చూస్తుంటే పంటల కొనుగోలుపై సర్కార్ మాటలు నీటిమూటలేనని విధితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని, గన్నీ బ్యాగులు, కాంటాలు, లారీలు కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఇకనైనా గిట్టుబాటు ధరకు పంటంతా కొనకపోతే రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.  అన్నదాతల ఆగ్రహాన్ని సర్కార్ చవి చూడకతప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.