Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 6:26 pm Posted by : ramakrishna

తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని కించపరుస్తావా ?

 

. . . ప్రజల ఆకాంక్షలంటే అంత చులకనా తేజస్వీ సూర్య ?

 

. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల ఆకాంక్ష అంటే అంత చులకన అయ్యిందా అంటూ మండిపడ్డారు. తేజస్వీ సూర్య ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ పోరాటాన్ని అవమానపరిచేలా మాట్లాడతావంటూ హెచ్చరించారు. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. 6 దశాబ్దాల పాటు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు చేసిన పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడతవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్నే కాకుండా తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను కూడా తేజస్వీ అవమానించారని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడిన సరే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

. . . బీజేపీ ఎంపీలు స్పందించాలి

తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత ఎంపీలుగా కొనసాగే అర్హత మీకు లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే సత్తా లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

 

Will you belittle the struggle for the achievement of Telangana?