కామారెడ్డి, బతుకమ్మ :
మాంసం కూర వండలేదని అడిగినందుకు భర్తను హత్య చేసిన భార్యని పోలీసులు సోమవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. కామారెడ్డి పట్టణం లోని గోసంగి కాలనీలో ఈ నెల 25 న రాత్రి 10 గంటల సమయంలో కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో మెడపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో శివాజీ అక్కడికక్కడే మరణించాడు. శివాజీ అన్న కోదండం సూరి ఇచ్చిన ఫిర్యాదుతో కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రక్తపు నమూనాలు, ఇతర భౌతిక సాక్ష్యాలు సేకరించారు. విశ్వసనీయ సమాచారంతో ఏప్రిల్ 27న సోమవారం కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన కొడవలి, రక్తపు మరకలతో ఉన్న చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివాజీకి మద్యం, జూదం అలవాట్లు ఉండేవని, కుటుంబ సమస్యలపై భార్యను తరచే వేధించేవాడన్నారు. దీంతో ఇద్దరి మద్య తరచూ గొడవలు జరిగేవని, ఏప్రిల్ 25న జరిగిన ఘర్షనలో ఆవేశానికి లోనైన లక్ష్మి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇన్ చార్జి డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో పట్టణ ఇన్స్ పెక్టర్ బి.నరహరి కేసును సమర్థవంతంగా విచారించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయ స్థానం రిమాండ్ కు తరలించింది.