
. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్.. రెగ్యులర్ ఉద్యోగులకు హాజరుపట్టిక
. మున్సిపల్ కార్పొరేషన్ లో ఇష్టారాజ్యం
. సమయ పాలన పాటించని ఉద్యోగులు
. హాజరైన వారెవరో.. గైర్హాజరైన వారెవరో.. తెలియని పరిస్థితి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ లో పాలనావ్యవహారాలు గాడితప్పుతున్నాయనేందుకు ఉద్యోగుల అటెండెన్సే ఉదాహరణగా నిలుస్తోంది. చాలా మంది ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో కార్యాలయానికి వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్ అమలు చేస్తుండడంతో వారు సమయానికి చేరుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు బయోమెట్రిక్ లేకపోవడం, రిజిస్టర్ లో సంతకాలు చేసే పద్ధతి అమలు చేస్తుండడంతో వారు సమయ పాలన పాటించడం లేదు. అంతా మా ఇష్టం అన్న చందంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆలస్యంగా కార్యాలయానికి వస్తున్న ఉద్యోగుల్లో తమను అడిగేవారెవరు? అనే ధోరణి స్పష్టంగా కనబడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరు శాఖలు పనిచేస్తుండగా, వివిధ పనుల నిమిత్తం ఆయా విభాగాలకు వస్తున్న నగరవాసులకు ఏ శాఖ లో ఏ ఉద్యోగి ఉన్నారో అర్థంకాని పరిస్థితి ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అందులో పని చేసే ఉద్యోగులకు అటెండెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రెగ్యులర్ ఉద్యోగులకు సైతం బయోమెట్రిక్ అమలు చేస్తే పరిస్థితిలో మార్పు సాధ్యమవుతుందని, పాత విధానాన్ని(అటెండెన్స్ రిజిస్టర్) పక్కకు పెట్టాలని నగరవాసులు అంటున్నారు.
