. . . గ్రంథాలయం లేక చదువుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు
. . . ప్రభుత్వ గ్రంథాలయం కోసం నిరుద్యోగ యువత ఎదురుచూపులు
. . . గ్రంథాలయం లేక చదువుకు తీవ్ర ఆటంకం
. . . విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో ప్రభుత్వ గ్రంథాలయం లేకపోవడంతో నిరుద్యోగ యువత, విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలు, గ్రూప్స్, డీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ తదితర పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇళ్లలో స్థలాభావం, విద్యుత్ అంతరాయాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఏకాగ్రతతో చదవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పట్టణాలకు వెళ్లి గ్రంథాలయాల్లో చదవాల్సి రావడంతో అదనపు ఖర్చు, సమయ నష్టం కూడా ఎదురవుతోందని తెలిపారు.ప్రభుత్వ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, ప్రతిపక్ష నాయకులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, చదువుకునేందుకు ప్రత్యేక రీడింగ్ హాల్, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పించాలని నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనివల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరడంతో పాటు విద్యా అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
