హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ లక్ష్యంగానే ముందుకు వెళ్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో జనం బాట యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈకార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజల వాయిస్ తెలుసుకుంటామన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధనకుడు.. మహా నాయకుడు.. దారులు వేరు కావటంతోనే జనం బాట పోస్టర్ లో కేసీఆర్ ఫోటో పెట్టలేదన్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోలేమని వ్యాఖ్యనించారు. కేసీఆర్ ను అగౌరవపరిచే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు. సామాజిక తెలంగాణ ఒక నినాదం కాదు. అది మా విధాన పరమైన నిర్ణయమన్నారు. జాగృతి ఉన్నంత వరకు అన్ని వర్గాలకు మేలు కోసం కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాద్ లో కూర్చొని సమస్యలు మాట్లాడటం కన్నా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఈనెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే వరకు జాగృతిలో కేసీఆర్ ఫోటో పెట్టలేదన్నారు. జాగృతి మొదలైనప్పుడు జయశంకర్ సార్ ఫోటో ను మాత్రమే పెట్టామన్నారు. తాను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాతనే కేసీఆర్ ఫోటోను జాగృతి కార్యక్రమాల్లో పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు సంస్థను పటిష్టం చేసుకుంటామన్నారు. మళ్లీ కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటామన్నారు. పార్టీనే వద్దనుకున్నాక ఎమ్మెల్సీ పదవి మీద వ్యామోహం లేదన్నారు. తన రాజీనామా యాక్సెప్ట్ చేయకపోవటానికి కాంగ్రెస్ రాజకీయమేమిటో తెలియటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల వైఫల్యం చెందిందన్నారు. ప్రతిచోట పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చిన్న విషయమని, తెలంగాణ అనేదే పెద్ద అంశంమని స్పష్టం చేశారు.
