- ఆరు హామీలపై ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
- మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వేలు, వాయిదాల పద్దతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సింది రీసర్వే కాదు రీపోలింగ్ అని స్పష్టం చేశారు. ఎలక్షన్ ఎప్పుడు జరిగినా ప్రజల సెలక్షన్ కేసీఆరేనని, రేవంత్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి లిద్దరూ ఐరన్ లెగ్ లేనని,వారెక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ బుగ్గి పాలై బొగ్గులుగా మారుతోందని జీవన్ రెడ్డి వ్యాఖ్యా నించారు.రాహుల్ గాంధీకి రైఫిల్ రెడ్డి బాగోతాలన్నీ తెలిసిపోయాయని, అందుకే రేవంత్ మొహం చూడడానికి కూడా రాహుల్ ఇష్టపడటం లేదని ఆయన అన్నారు. సీఎం 32 సార్లు ఢిల్లీ పోయినా రేవంత్ కు రాహుల్ అపాయింట్ మెంట్ దొరక లేదన్నారు. తాజాగా కులగణన రిపోర్టు పట్టుకెళ్లినా రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరు హామీలపై ప్రశ్నిస్తారనే భయంతో పాటు రేవంత్ మొహం చూడటం ఇష్టం లేకనే రాహుల్ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నార న్నారు. కాంగ్రెస్ లో మళ్లీ అదే ముఠాల సంస్కృతి రాజుకుంటున్నదని ఆయన తెలిపారు. భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు ఎవరికి వారే గుంపులుగా విడిపోయి ఢిల్లీలో సీఎం పదవి కోసం పైరవీలు చేసుకుంటూ పాలనను గాలికొదిలేసారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు జీరో వస్తుందన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను గ్రామ పొలిమేరల్లోకి రాకుండా తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ విజయాన్ని అడ్డుకోలేరని, రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా కారు రావాలి,కేసీఆర్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంకిషన్ రావు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు.
