తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు తలదూర్చడం, సేకరణ కేంద్రాలను అనుభవం లేని వారికి అప్పగించడంతో తీవ్ర ఆలస్యమై రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసిముద్దమవుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధాన్యం, పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.